హైదరాబాద్ ఏప్రిల్ 16 (ఈ తరం భారతం );ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.2016-17 విద్యాసంవత్సరంతో పాటు ఆ తరువాత డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు ఈ వన్ టైం ఛాన్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులని వివరించారు. సాధారణ పరీక్షా ఫీజుతో పాటు ఒక్కో పేపర్కు రూ.2,000 చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరీక్షలను జూన్ నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
