హైదరాబాద్, మే 13 (ఈతరం భారతం ); : గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసేందుకు తగు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, అదేవిధంగా డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని సిఎస్ పేర్కొన్నారు. విద్యార్థులు వారికి కావాల్సిన సబ్బులు, కాస్మోటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయకేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడ నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పేట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సరుకుల క్వాలిటీ విషయంలో రాజీపడొద్దని సిఎం ఆదేశించారని, ఆ మేరకు అధికారులు తగు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సిఎస్ సూచించారు. ఈ సమావేశంలో ఎస్ సి డెవలప్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎ. వర్షిణి, సెర్ఫ్ సిఇఒ దివ్య, బిసి వెల్ఫేర్ సెక్రెటరీ ఇ.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
