అనంతపురం జూన్ 4 (ఈతరం భారతం);: భూ అక్రమార్కుడు ఆదినారాయణేనని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆదినారాయణ భూ అక్రమాలపైన, తనపై చేసిన ఆరోపణల పైన సిట్టింగ్ జడ్జి లేదా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరి భూముల జోలికీ పోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఏ మచ్చా లేకుండా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సేవ చేస్తున్నానని వివరించారు.పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరు కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా సాయం చేస్తూ, వారి కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తున్నానని పేర్కొన్నారు. జిల్లాలో విద్యాసంస్థలను స్థాపించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించానని పేర్కొన్నారు. తనది ఒక వ్యవస్థ అని, తాను ఎంతో పద్ధతిగా ఉంటానని, ఎవరిజోలికీ పోనని అన్నారు. ఈ మధ్య గొడ్డుమర్రి ఆదినారాయణ అనే వ్యక్తి అనవసరంగా, ఆధారాలు లేకుండా తనపై అభాంబాలు వేస్తున్నారని, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
