అమరావతి, జూన్ 4 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని.. జగన్ను కూడా జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది.. అది కరెక్ట్ కాదు కదా’ అని మంత్రులతో సీఎం అన్నారు. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. ‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ ముఖ్యమంత్రి సూచించారు.ఇది వరకు నేరస్థులు ప్రభుత్వానికి బయపడి వెళ్ళిపోయేవారని.. ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేరం చేసి మళ్ళీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు. గంజాయ్ బ్యాచ్ నేరాలు చేసిందని.. తప్పులు చేసి.. తిరిగి ప్రభుత్వంపైనే నెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మంత్రులు బాగా పనిచేశారని.. ఇంకా కష్టపడాలని.. ఈ ఏడాది ఏం చేశారనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు. రాబోయే ఏడాదికి ప్లాన్ చేసుకోవాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామని, కానీ ఏం చేసినా జనాన్ని ఎంపవర్ చేయాలని మంత్రులకు తెలిపారు.పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్లకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని.. ఆలస్యం అయితే ప్రతీ ఏడాది వ్యయం పెరుగుతుందని అన్నారు. నిధుల సమీకరణ కూడా జరుగుతోందన్నారు. పోలవరం, బనకచర్లకు కేంద్రం, రాష్ట్రం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో కూడా నిధులు వస్తాయని అన్నారు. క్వాంటం వ్యాలీని చేయాలని.. 2026 జనవరికి కార్యరూపం తీసుకురావాలని వెల్లడించారు. క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చూపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.ఈ నెల 15న తిరుపతిలో సినిమా సెలబ్రిటీలతో యోగా నిర్వహించాలని తెలిపారు. టూరిజం మంత్రి వెళ్లి సెలబ్రెటీలను ఆహ్వానించాలని.. తాను కూడా కొంత మందికి ఫోన్లు చేసి చెబుతానని సీఎం అన్నారు. 1983లో మహానాడుకు షర్ట్లు పసుపునీళ్లలో ముంచుకుని అటెండ్ అయ్యారని.. అప్పటి నుంచి మహానాడు నిర్వహిస్తున్నారన్నారు. వాతావరణం బాగా సహకరించిందని.. ఇది వరకు సమ్మర్లో అల్లాడిపోయామన్నారు. కానీ ఇప్పుడు వాతావరణం మంచిగా సహకరించిందని అన్నారు. ఈ సారి మహానాడు బాగా జరిగింది… కార్యకర్తలు కూడా బాగా వచ్చారని కేబినెట్ సమావేశంలో తెలిపారు.
సీఎంకు మంత్రుల అభినందనలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎంకు మంత్రులు అభినందలు తెలిపారు. కూటమిలోని పక్షాల మధ్య సమన్వయం బాగా ఉందని సీఎం అన్నారు. పీ4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గం వరకు వెళ్ళాలని మంత్రులకు సూచించారు. విజయ మాల్య లాంటి వాళ్ళు డబ్బులు తిని వెళ్ళిపోయారని.. రాజకీయ ముసుగులో ఉండి జగన్ నేరాలు చేస్తున్నారని విమర్శించారు. నేరస్థులను కూడా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
జగన్, మిథున్ రెడ్డి ఇద్దరిలో ఎవరు ముందు జైలుకు వెళ్తారనే అంశంపై వైసీపీలో చర్చ జరుగుతోందన్నారు. తప్పులు చేసిన వారు ఎవరు కూడా తప్పించుకోకూడదని స్పష్టం చేశారు. చట్టం, న్యాయ ప్రకారం వెళ్ళాలని సీఎం తెలిపారు. నేరస్థుడు నేరం చేసి బయటకు వెళ్లిన తరువాత అతను ఏం చేస్తున్నాడనేది తెలుసుకోవాలన్నారు. ఆ సిస్టం వెంటనే అమలు చేయాలని చెప్పారు. నదుల అనుసంధానంపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ సీఎం సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం, బనకచర్లను చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు.
కేబినెట్లో యువగళం గురించి మంత్రి లోకేష్ ప్రస్తావిస్తూ.. యువగళం ప్రభుత్వానికి బ్రేక్ త్రూ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడానికి, అధికారాన్ని అనుభవించడానికి యువగళం పాత్ర కూడా ఉందని సీఎం అన్నారు. గత ఏడాది ఇదే రోజు మనం ఊహించని విజయం లభించిందన్నారు. ప్రజలు ఆశయాలకు, అంచనాలకు అనుగుణంగా పని చేయాలని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.