ఆసిఫాబాద్ నవంబర్19 (ఈతరం ఇండియా న్యూస్ ); : సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేతకాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్ గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార యాత్రలో ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్,కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆయన మా పార్టీపై అనవసర నిందలు వేయడం మానుకోవాలి. ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. రూ.3 కు వచ్చే యూనిట్ కరెంట్ ని, రూ.14 కు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తాం” అని స్పష్టం చేశారు.