జనగామ నవంబర్ 14 (ఈతరం ఇండియా న్యూస్ );ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభల్లో మాట్లాడినా.. సభలకు జనాలు, నేతలు క్యూ కట్టేస్తుంటారు. ఇక రాష్ట్ర ప్రజలు అయితే టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రచారానికి శంఖారావం పూరించినప్పటి నుంచి.. కేసీఆర్ ప్రసంగంలో మునుపటిలా పస.. పంచ్లు, కౌంటర్లు మిస్సవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. కాసింత దృష్టిపెట్టి కేసీఆర్ స్పీచ్ వింటే ఇట్టే అర్థమైపోతుంది. సరిగ్గా ఇదే టైమ్లో సారు ఎందుకో అసహనం ప్రదర్శిస్తున్నారు. మంగళవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుంటే అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలేశారు. దీంతో కేసీఆర్కు చిర్రెత్తుకొచ్చింది. కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేస్తూ.. అరె హౌలా.. సభలో మాట్లాడాలా..? ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలారా..? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. సభలో కేసీఆర్ ప్రసంగం వినడం పక్కనెట్టి.. బాస్ ఎందుకిలా మాట్లాడారు..? ఎందుకింత అసహనం..? అసలెందుకీ ఆగ్రహం..? అంటూ నేతలు, సభకు వచ్చిన కార్యకర్తలు చర్చించుకుంటున్న పరిస్థితి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లోనూ తానే పోటీచేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.! రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. గులాబీ బాస్ ప్రసంగంలో ఎందుకో అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలిసిపోయిన పరిస్థితి. ఎలాగంటే బహిరంగ సభల్లో అసలు కేసీఆర్ అసహనం, ఆవేశం మాత్రమే కనిపిస్తోందే తప్ప.. పస ఉన్న ప్రసంగంలా కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి.