ఈతరం భారతం హైదరాబాద్, జూన్ 3 : సంక్షేమ నిధి స్టాంప్ ధరను రూ.రెండు వందలకు తగ్గించాలని తెలంగాణ అడ్వకేట్ నోటరీ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి యాదగిరి అన్నారు. ఈ మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హై కోర్టు లోని బార్ కౌన్సిల్ కార్యాలయ ఇంచార్జీ, కార్యదర్శి నాగలక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గంజి యాదగిరి మాట్లాడుతూ ఇప్పటివరకు సంక్షేమ నిధి టికెట్ ధర కేవలం వంద రూపాయలు మాత్రమే ఉండేదని, దానిని తాజాగా రూ.250 పెంచారని అన్నారు. ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టులలో పనిచేస్తున్న న్యాయవాదులపై ఆర్థిక భారం మోపేలా ఉన్నదని ఆయన అన్నారు. అలాగే, తెలంగాణలోని న్యాయవాదుల సంక్షేమ నిధి ప్రయోజనాన్ని ఇప్పటివరకు ఉన్న రూ.6 లక్షలను రూ.12 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
న్యాయవాదులందరికీ ప్రయోజనం చేకూరేలా తాము చేసిన విజ్ఞప్తికి తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి.అనిల్ కుమార్, ఇంతియాజ్, కోశాధికారి ఎ.బి. నర్సింగ్ రావు, కార్యదర్శులు కే. మురళీధర్, మయబ్రహ్మ నరసింహ, కే. నరసింహారావు, ఎం. వెంకటేష్, సభ్యులు పి.సతీష్ కుమార్ పాల్గొన్నారు.