ఖమ్మం జూన్ 7 (ఈతరం భారతం);: ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. శుక్రవారం రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము కల్లూరు ఎన్ఎస్పీలోని ఓ హోటల్కు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాము.. పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ ముదరడంతో రాము తన అనుచరులకు సమాచారం ఇచ్చాడు. తల్లాడ నుంచి కల్లూరుకు భారీగా చేరుకుని హల్చల్ చేశారు.దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు ఎస్ఐ హరిత.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినకపోవడంతోపాటు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాయలు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో ఎస్ఐ హరిత.. రాముపై చేయి చేసుకున్నారు. నన్నే కొడతావా అంటూ మహిళ అనికూడా చూడకుండా ఆమె ఛాతీపై చేసివేసి తోసేశాడు. అప్రమత్తమైన పోలీసులు రాముతోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అధికారం మదంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు మహిళా ఎస్ఐపై దాడిచేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.