నిజామాబాద్ జనవరి 13 (ఈతరం భారతం);: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డాగా చేసుకొని ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు నడపడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆమె పదవీకాలంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు.రోగుల అవస్థలను పట్టించుకోకుండా తన చాంబర్ను ఫంక్షన్ హాల్లా మార్చుకొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, సిబ్బంది నుంచి కానుకలు పొందడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆమెను బాధ్యతలు నుంచి తప్పించింది. నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించింది.
ఏం జరిగిందంటే..?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన శుక్రవారం రాత్రి ఫంక్షన్హాల్గా మారిపోయిన సంగతి తెలిసిందే. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తన చాంబర్ను ఫంక్షన్హాల్గా మార్చేశారు. రంగురంగుల అలంకరణలు, బెలూన్లు, ధగధగ మెరిసే లైట్ల మధ్య అట్టహాసంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. భారీ కేకు, బొకేలు, బహుమతులు, ఫొటో షూట్లు, వీడియోలు ఇలా ఫంక్షన్హాల్కు ఏమాత్రం తీసిపోకుండా చాంబర్లో వేడుకలు జరిగిపోయాయి. ‘యథారాజ.. తథా ప్రజ’ అన్నట్టు.. సిబ్బంది కూడా తమ ‘మేడమ్’ను ప్రసన్నం చేసుకునేందుకు చాంబర్ను అలంకరించడమే కాకుండా, శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టారు. మొత్తంగా కొన్ని గంటలపాటు సూపరింటెండెంట్ చాంబర్తోపాటు ఆ పరిసరాలన్నీ ఫంక్షన్ హాల్ను తలపించాయి.ఓ వైపు వేడుకలు జరుగుతుండగా.. శుక్రవారం రాత్రి రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ బిద్యానాయక్ ఫిట్స్ వచ్చిన భార్యను తీసుకొని దవాఖానకు పరిగెత్తుకొని వచ్చారు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచ్చర్గానీ, వీల్చైర్గానీ లభించలేదు. దీంతో భార్యను భుజాలపై వేసుకొని లోపలికి వెళ్లాడు. లోపల డాక్టర్లుగానీ, సిబ్బందిగానీ ఎవరూ కనిపించలేదు. అందరూ ‘మేడమ్’ చాంబర్ వద్దనే ఉన్నారు. దవాఖానలోని ఏడు అంతస్తులు తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. చివరికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు.ఆయన చొరవతో అర్ధరాత్రి తర్వాత వైద్యులు బాధితురాలిని చేర్చుకొని చికిత్స అందించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు సైతం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే బాధితుడు రోగిని భుజాన వేసుకుని దవాఖాన మొత్తం తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై వివరణ కోరేందుకు సూపరింటెండెంట్ను సంప్రదించగా ఆమె స్పందించలేదు. నిజామాబాద్ దవాఖాన ఫంక్షన్ హాల్గా మారడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెప్తున్నారు. నిరుడు కూడా ఇదే స్థాయిలో వేడుకలు జరిగాయని, రంగురంగుల డెకరేషన్, స్పార్కిల్స్ గన్, కేక్ వంటివాటితో హంగామా చేశారని అంటున్నారు.