యాదగిరిగుట్ట మే 17 (ఈతరం భారతం ):: యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని తీర్చి దిద్దే క్రమంలో దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ ఎస్. వెంకట్రావ్ ( ఐఏఎస్ ) ను యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. నియమితులైన నాటి నుంచి ఆయన సమర్థ పాలన దిశగా కృషి చేస్తున్నారు. శనివారం ఆయన ఆలయంలో దర్శన క్యూ లైన్లను, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీ స్వామి వారి ఊరేగింపు సేవలో భక్తులతో, క్యూ క్యూలైన్ల లోనీ భక్తులతో దర్శన వసతులు, దర్శనమునకు పట్టిన సమయము, సదుపాయాలు తదితర సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు .శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపము వద్ద భక్తుల సౌకర్యార్థము వెంటనే ఏసీలు ఏర్పాటు చేయాలని ,శ్రీ స్వామి వారి వ్రతములో పాల్గొన్న భక్తులకు ప్రస్తుతము ఇవ్వబడుచున్న సామాగ్రి, రవ్వ ప్రసాదముతో పాటుగా అదనముగా శ్రీ స్వామి వారి శేషవస్త్రం( శెల్లా, కనుము ) అందజేయాలని ఆదేశించారు.
