మేడారం అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలుల బీభత్సం
50వేలకు పైగా చెట్లు నేలమట్టం
మేడారం సెప్టెంబర్ 4 (ఈతరం భారతం); మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలులు బీభత్సం సృష్టించడంతో మహావృక్షాలు కిందకూలాయి. ఒకే చోట మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో 50 వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి.ఈ నెల 1వ తేదీన పరిశీలనకు వెళ్లిన అధికారులు సుడిగాలి బీభత్సానికి చెట్లు కూలడం చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. టోర్నడోల కారణంగానే ఈ చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వృక్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని తెలిపారు. అయితే 50 వేలకు పైగా చెట్లు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.