ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 29 శనివారం:
బర్డ్ఫ్లూ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జంతువులు, పక్షులలో ఈ వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జంతువుల నుంచి మానవులకు బర్డ్ఫ్లూ సోకే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. బర్డ్ఫ్లూను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆసియా-పసిఫిక్ దేశాలకు సూచించింది. అయితే భారత్లో ప్రస్తుతం స్వైన్ఫ్లూ (H1N1) కేసులు పెరుగుతున్న సమయంలోనే, డబ్ల్యూహెచ్ఓ బర్డ్ఫ్లూ అలర్ట్ ఇవ్వడంతో ఈ హెచ్చరికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.ఆగస్టు 25- 27 వరకు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయాలు సంయుక్తంగా బర్డ్ఫ్లూ వైరస్ గురించి ఓ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ మీటింగ్లో 150 మందికి పైగా ఇన్ఫ్లుయోంజా నిపుణులు, సైంటిస్టులు, ప్రజారోగ్య అధికారులు పాల్గొన్నారు. పక్షులలో బర్డ్ఫ్లూ వ్యాప్తి కొనసాగుతుందని ప్రజారోగ్య నిపుణులు పేర్కొన్నారు. జంతువుల నుంచి మానవులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే విషయంపై ఈటీవీ భారత్లో ఆరోగ్య నిపుణులు, సైంటిస్టులు, వైద్యులు మాట్లాడారు.
బర్డ్ఫ్లూ సోకిన చాలా మంది రోగులలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటువ్యాధుల నిపుణురాలు, మెడికల్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ మనాలి అగర్వాల్ తెలిపారు. ఈ లక్షణాలతో పాటు న్యుమోనియాకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తాయని చెప్పారు. తరచుగా కనిపించే శ్వాసకోశేతర లక్షణాలలో విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉన్నాయని వివరించారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి సన్నద్ధత చాలా కీలకమన్నారు.















