న్యూఢిల్లీ మార్చ్ 18 ఈతరం భారతం:
రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రసంగించారు. 59 మంది సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తన సందేశంతో ఆ సభ్యులకు వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదన్నారు. రిటైర్ అయి వెళ్లిపోతున్న ఎంపీలు.. దేశం కోసం తమ విధులను నిర్వర్తిస్తూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఫేర్వెల్ లాంటి సందర్భాల్లో పార్టీల మధ్య ఉన్న విబేధాలు సమసిపోతాయన్నారు. మనలో ఒకేరకమైన భావోద్వేగం వస్తుందని, మనతో ఇన్నాళ్లు పనిచేసిన తోటి సభ్యులు తమ జీవితంలో మరో మార్గాన్ని అన్వేషించబోతున్నారని గ్రహిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అయితే మళ్లీ రాజ్యసభకు రాలేని వారిని ఉద్దేశిస్తూ.. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ అంటూ ఉండదని, మీ కోసం భవిష్యత్తు ఎదురుచూస్తోందని, ఈ దేశ నిర్మాణం కోసం మీ అనుభవాలు చాలా అవసరం ఉంటుందని ప్రధాని తెలిపారు.రాజ్యసభలో సీనియర్ సభ్యులుగా ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆ ముగ్గురూ రాజకీయాల్లో మహాయోధులన్నారు. పార్లమెంట్ కోసం వారి సగం కన్నా ఎక్కువ జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారు సభలకు హాజరువుతున్న తీరు, వారిలో అంకితభావం అసాధారణమైందన్నారు. కొత్తగా ఎంపికైన ఎంపీలు వారి నుంచి స్పూర్తి పొందాలని ప్రధాని ఆశించారు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చాలా మృదుస్వభావి అని అన్నారు. కానీ నిత్యం కార్యాచరణలో నిమగ్నమై ఉంటాడన్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే గురించి మాట్లాడుతూ ఆయన నిజంగా ఎవర్గ్రీన్ అన్నారు. సభ బయట కూడా ఆయన వ్యంగాన్ని , హాస్యాన్ని ప్రదర్శించాలని ఆశించారు.పార్లమెంట్ ప్రక్రియలో ఉన్న ఉభయసభల విధానం గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. ఓ చట్టానికి ఆమోదం దక్కాలంటే రెండో అభిప్రాయం అవసరంమని, అలాంటి విధానం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఒక సభలో తీసుకున్న నిర్ణయం.. రెండో ఓపీనియన్ కోసం మరో సభకు వెళ్తుందని, అక్కడ జరిగిన చర్చతో నిర్ణయాత్మక విధానం కొత్త రూపు సంతరించుకుంటుదని ప్రధాని అన్నారు
.















