ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 3.10.2024 : హైద్రాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంఛార్జ్ విభాగాధిపతి యాదగిరి కంభంపాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజంలో డాక్టరేట్ డిగ్రీని ప్రకటించింది. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ నుండి ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ : ఏ కేస్స్టడీ అన్న అంశంపై యాదగిరి పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరెడ గ్రామానికి చెందిన యాదగిరి అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖలో అధ్యాపకులుగా చేరాక డిగ్రీ, పీజీ స్థాయిలలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ప్రజా సంబంధాల కోర్సుల ప్రామాణికతను విస్తృత స్థాయిలో పెంచేందుకు ఎంతగానో కృషి చేశారు. యాదగిరి ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ( పిఆర్ ఎస్ఐ) సంస్థకు హైద్రాబాదు ఛాప్టర్ సెక్రెటరీగా రెండు సార్లు ఎన్నికై సేవలందిస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ జర్నల్కు సంపాదకవర్గ సభ్యులుగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం అదే పత్రికకు గౌరవ పాత్రికేయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజం, ప్రజా సంబంధాలపై యాదగిరి రాసిన పలు ప్రామాణిక వ్యాసాలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. నిరంతర కృషి, పరిశోధనాత్మక అధ్యయనం, అంకిత భావంతో ప్రణాళికయుతమైన కృషి చేసి డాక్టరేట్ డిగ్రీని అందుకున్న యాదగిరిని జర్నలిజం శాఖల ఆచార్యులు, విద్యారంగ ప్రముఖులు, పరిశోధకులు, బంధుమిత్రులు అభినందించారు.















