విఘ్నాలను బాపే విఘ్నేశ్వరుడి పండగ అంటే పిల్లలకు పెద్దలకు ఎంతో ఆనందం .ఈ నవరాత్రులు. ఊరు ,వాడ ,పల్లె ,పట్నం అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకునే పండుగ. మన సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయకంగా జరుపుకునే పండుగ.ఏ శుభకార్యములో అయినా గణపతి పూజనే ముందుగా చేస్తారు
అంత ప్రాధాన్యతను సంతరించుకున్న గణేశుడు.నేడు ఈ పండుగ కాలుష్య కోరల్లో చిక్కి,విష సంస్కృతి పెరిగిపోతుంది. అడ్డు అదుపు లేకుండా చందాలు వసూలు చేస్తూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకొని నవరాత్రులు నిష్టగా పూజ చేసి నిమజ్జన సమయంలో కొందరు మధ్య మాంసాలు సేవించి కాళ్లతో తొక్కుతూ క్రేన్లతో తోసిపడేస్తూ బీభత్సంగా నృత్యాలు చేస్తున్నారు. ఇంకా కొందరు మరి దారుణం విగ్రహాల తలను కట్ చేసి వారి తలలకు బిగించుకొని సెల్ఫీలు దిగుతూ రాక్షస ఆనందం పొందు తున్నారు. ఇది ఎక్కడి సంస్కృతి..,?? ఇది మన సాంప్రదాయమా…??? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగిస్తూ రకరకాల రంగులు వాడుతూ అందనంత ఎత్తుగా విగ్రహాలను చేస్తూ పోటీ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ విగ్రహాలను చెరువులో ,నదుల్లో నిమర్జనం చేయడం వలన అక్కడున్న జలచరాలు చనిపోతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగక ,ఆ రంగులు నీటిలో కరిగి జల కాలుష్యం, మట్టి కలుషితమై చెరువులో నీరు గాని, మట్టి కానీ ఎందుకు పనికిరాకుండా పోతుంది. నవరాత్రుల్లో భజనలు, కీర్తనలు చేయకుండా డీ జే లు పెట్టి శబ్ద కాలుష్యానికి కారకులై ఎంతోమందిని అనారోగ్యాల పాలు చేస్తున్నారు. ఆది దేవుని పండగ అంటే కొండంత పండుగ అలాంటి పండగను మట్టితో తయారు చేసుకుని ఎత్తు కన్నా భక్తి ముఖ్యం అని భగవంతుని పూజిస్తే మానసిక ఆనందం. పండుగ అంటే పదిమందికలయిక ,సుఖసంతోషాల వెల్లువ కానీ వచ్చే తరానికి మనం ఏం నేర్పిస్తున్నామో ఆలోచించండి. మట్టితో గణపతిని చేద్దాం.. ఆకులతో అలంకరించుదాం.. పువ్వులతో పూజిద్దాం.. నైవేద్యాలను సమర్పిద్దాం.. కోరికల దండలు వేద్దాం… కోరికలు తీర్చమని వేడుకుందాం… మంగళ హారతులతో సాగనంపుదాం… గంగమ్మ ఒడిలో చేరుద్దాం… అందరం మట్టి వినాయకుడిని పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
















