విష్ణుకుండినుల సైనిక స్థావరం కీసరగుట్ట
తెలంగాణలోని ప్రత్యేక శైవ క్షేత్రాలలో ఒకటి కీసరగుట్ట. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని కే సర గిరి అని పిలిచేవారు. చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం ఉత్తరార్థం నుండి ఏడవ శతాబ్దం పూర్వార్ధం వరకు ఆంధ్ర దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండినుల రాజవంశానికి కీసర గుట్టకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది
విష్ణు కుండినులు మొదట ఇంద్రపురిని/ఇంద్రపాల నగరాన్ని అంటే ప్రస్తుత నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లోని తుమ్మలగూడెం ను రాజధానిగా చేసుకుని ప్రజా రంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురాతత్వ శాఖ వారి త్రవ్వకాల పరిశోధనలో మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు , ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ గుండాలు వెలుగు చూశాయి. ఈ వంశములోని మొదటి గోవింద వర్మ అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను , చైత్యా లను, దేవాలయాలను నిర్మించి ప్రసిద్ధి చెందినట్లు ఇంద్రపాలనగరంలో లభించిన తామర శాసనం తెలియజేస్తూ ఉంది.
విష్ణుకుండినుల రాజముద్రిక అంటే రాజ లాంఛనం లంఘించే సింహం. వారు తమ శాసనాల్లో బ్రహ్మ క్షత్ర తేజో భృతులు అంటే పుట్టుకతో బ్రాహ్మణులు వృత్తి రీత్యా క్షత్రియుల లాగా రాజ్యపాలన చేసినట్లు తెలుపుకున్నారు. విష్ణుకుండినులు మొదట బౌద్ధులు.
వీరు అపురూపమైన దేవాలయాలు గృహాలయాలు నిర్మించారు. నల్లగొండ జిల్లా చెరువు గట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మల గూడెం (ఇంద్రపురి) లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలోని ఉత్తర రాజా రామలింగేశ్వరాలయం వీరి నిర్మాణాల్లో కొన్ని. విష్ణు కుండినులు విద్యా వ్యాప్తి కి శ్రద్ధ తీసుకొని ఎన్నో ఘటిక స్థానం లను నెలకొల్పారు. అంటే ఇవి ప్రస్తుత విశ్వవిద్యాల యాల వంటివి. కీసరగుట్ట పక్కనే ఉన్న ఘట్కేసర్ ఒకప్పటి ఘటికా స్థానమే.
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని క్రీస్తు శకం 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానేష నవాబు దగ్గర మహామంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు దర్శించుకున్నారు. దీన్ని హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కన్న మాదన్న నిర్మించిన ఆలయానికి వెనుక ఒక ఏకశిలా విజయ స్తూపం ఉంది. దీనిపై మత్స్య కూర్మ వరాహ గణపతి ఆంజనేయ విగ్రహాలు చెక్కి ఉన్నాయి.
ఆలయానికి ముందు బాగాన హనుమంతుడు కాశీ క్షేత్రము నుండి తీసుకువచ్చిన శివలింగాలు, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, సీతమ్మ గుహ, రెండు కొండల మధ్య తెల్ల తామర కొలను, పాలకొండ ఇక్కడ చూడదగినవి
–ఈతరం భారతం















