ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ మార్చ్ 18
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జల సంధిని నియంత్రిస్తున్న ఇరాన్ అడ్డుకునే ప్రయత్నాలను అమెరికా సైన్యం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బుధవారం హర్మూజ్ సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. దాదాపు 2,268 కిలోల బాంబులతో దాడిచేసినట్టు అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీనికి సమీపంలోని భూగర్భ మిస్సైల్ సిటీ ఖేమ్క్పై సైతం దాడిచేసినట్టు తెలిపింది.‘‘హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ యాంటీ- నౌక విధ్వంసక క్షిపణి స్థావరాలు అంతర్జాతీయ సముద్ర రవాణాకు ప్రమాదకరంగా మారాయి. అందుకే ఈ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం.. లోతుగా చొచ్చుకుపోయే 5 వేల పౌండ్ల బరువు (దాదాపు 2,268 కిలోలు) ఉన్న శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాం’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించింది. అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్త ఆపరేషన్తో ఇరాన్పై ఫిబ్రవరి 28న దాడులు చేయడంతో యుద్దం మొదలైంది. దీంతో ఐదో వంతు ప్రపంచ చమురు రవాణాకు ముఖ్యమైన హర్మూజ్లో నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి.ఇదిలా ఉండగా, హర్మూజ్ రక్షణకు తమతో చేతులు కలపాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్థనను నాటో సహా మిత్రదేశాలు తిరస్కరించాయి. ప్రపంచం కోసమే తాను యుద్ధం చేస్తున్నానని ట్రంప్ చెబుతున్న మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. ఆయన చర్యలను ఎవరూ సమర్ధించడం లేదు. ‘‘మేము నాటోకు ఎంతో సహాయం చేసినప్పటికీ అమెరికాకు మద్దతు లభించడం లేదు’’ అని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకోవడం మిత్రదేశాల ప్రయోజనాలకే శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు.















