హైదరాబాద్ మార్చ్ 4 ఈతరం భారతం:
రచయిత రచనలను జల్లెడ పట్టే విశిష్ఠ. విమర్శలు నేటి సాహిత్యంలో కొంత వరకే ఉన్నాయనీ, పత్రికలలో స్థలాభావం చేత పత్రికలలో విమర్శలు, కట్టె కొట్టే, తెచ్చే చందాన విహంగ వీక్షణంగా మారినాయని డా|| కె.వి. రమణాచారి అన్నారు. తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో విశాఖ సంస్కృతి మాసపత్రిక, సౌమిత్రి పబ్లికేషన్స్, శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ సంస్థల ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రముఖ రచయిత కూర చిదంబరం రచించిన “సమీక్షా సౌరభాలు”, “సమీక్షా సుమమాలిక” గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన, తెలంగాణ ప్రభఉత్వ పూర్వ సలహాదారు డా॥ కె.వి. రమణాచారి రెండు గ్రంథాలను ఆవిష్కరించి ప్రసంగించారు.విమర్శలు కత్తిమీద సాము వంటివనీ, రచయిత హృదయాన్ని ఆకళింపు చేసుకొని తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుందనీ, ఆ విషయంలో కూర చిదంబరం కృతకృత్యులయ్యారని అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన నేటి నిజం పత్రిక సంపాదకులు బైస దేవదాసు మాట్లాడుతూ కూర చిదంబరం మంచి రచయితనే కాకుండా ఉత్తమ విమర్శకునిగా ప్రతిభ కలవారనీ, వారు సమీక్ష చేసిన అనేకమంది రచయితల భిన్న రచనలను సంక్షిప్త సుందరంగా, పరనీయంగా, కొండొకచో మెత్తని చురకలతో అందించారని అన్నారు. మరో విశేషం- ఒకే రచయిత ‘సింహప్రసాద్’ రచనలపైన ఆయన చేసిన సమీక్షలతో ఒక పుస్తకంగా తేవటం అరుదైన విషయమని అభినందించారు. “సమీక్షా సౌరభాలు” గ్రంథాన్ని తన సాహితీ మిత్రుడు కీ॥శే॥ తంగిరాల చక్రవర్తికి అంకితం ఇవ్వటం ఔచిత్య భరితంగానూ, వారి మైత్రికి నిదర్శనంగానూ ఉన్నావని అన్నారు. సభలో తంగిరాల పక్షాన వారి శ్రీమతి హాజరవటం ముదావహమన్నారు. అలాగే కూర చిదంబరం తన తల్లి తండ్రుల పేరిట 2025వ సంవత్సరానికి ఉత్తమ కథా రచయితగా రామాచంద్రమౌళి ‘నిర్వాణ’ను ఎన్నుకోవడం, ప్రోత్సాహక బహుమతిగా లలితావర్మ ‘ఆణిముత్యాలు’ని ఎంపికచేసి సత్కరించటం అభినందనీయమని, కూర శంకరయ్య, లలితమ్మలు ఇలా స్మరణీయులు కావడం గొప్ప సంస్కారమని అన్నారు.ఇంకా సభలో సాహితీవేత్తలు విహరి, సుధామ, సింహప్రసాద్, శివేల సన్యాసిరావు, రామా చంద్రమౌళి, లలితావర్మ, అనుముల బాబూరావు, గ్రంథకర్త కూర చిదంబరం ప్రసంగించారు. ఈ సందర్భంగా కూర శంకరయ్య స్మారక కథ పురస్కార గ్రహీత రామాచంద్రమౌళిని, లలితమ్మ స్మారక కథాపురస్కారాన్ని అందుకున్న లలితావర్మని గ్రంథకర్త ఘనంగా సత్కరించారు.















