ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 17
తెలంగాణలో లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించబోతోంది. ఉబర్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వంటి ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.ఈ మేరకు ‘తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు-2025’కు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 3 నుంచి 4 లక్షల గిగ్ వర్కర్లకు లాభం చేకూరే అవకాశం ఉంది. వీరిని ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తించి ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య సదుపాయాలు కల్పించనున్నారు.ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను ప్రారంభించనుంది. ఇందులో నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేస్తారు.గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంది.ఈ చట్టం ప్రకారం ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలు ప్రతి లావాదేవీపై 1 నుంచి 2 శాతం వరకు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులను గిగ్ వర్కర్ల సంక్షేమానికి వినియోగిస్తారు.ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గిగ్ వర్కర్లను అకారణంగా తొలగించడం కుదరదు. తప్పనిసరిగా 7 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు ఇలాంటి చట్టాలను అమలు చేశాయి. ఇప్పుడు తెలంగాణ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే గిగ్ వర్కర్ల జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.















