హైదరాబాద్, అక్టోబర్ 10 (ఈతరం భారతం): వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని ప్రకటించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది.















