మహబూబ్నగర్ ఫిబ్రవరి 25 ఈతరం భారతం:
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు.మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకులు కుల వివక్ష చూపుతూ చాకలి చంద్రకళ కుటుంబంపై అమానుషంగా దాడికి దిగడంతో ,రెండు నెలల పాప తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దాడికి గురైన బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేయడంతో వారంతా భయపడి గ్రామం వదిలి నాగర్కర్నూల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి.కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ,శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్ధన్ రెడ్డి, అలా వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుమ్మేర బాధితులకు సంఘీభావంగా దీక్షలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.















