హైదరాబాద్ జూలై 15 (ఈతరం భారతం);తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు లీగల్ నోటీసులు పంపించారు. బేషరతుగా మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. 25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని బీజేపీ చీఫ్ తరపు న్యాయవాది అటాచ్ చేశారు.నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుపైన సంచలన ఆరోపణలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై మాట్లాడుతూ.. హెచ్సీయూ (HCU)లో విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానం తెలంగాణ నూతన అధ్యక్షుడిగా రాంచందర్రావును ఎంపిక చేయడాన్ని తప్పుపడుతూ.. రోహిత్ వేముల హత్యకు కారకులైనవారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాంచందర్రావు నియామకం ఎంత మాత్రం సమంజసం కాదని కామెంట్ చేశారు. దీనికి కౌంటర్గా ఈ రోజు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు పంపించారు
.















