ఈతరం భారతం /హైదరాబాద్/ న వంబర్ 3
ఇటీవలే మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలు నీట మునిగాయి. ఆ తుఫాన్ నుంచి జనాలు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వాసులకు మరో బిగ్ అలర్ట్ వచ్చింది. హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం విదర్భ, ఆ పరిసర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తన ద్రోణి సోమవారం నాటికి బలహీనపడింది. ఈ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఇప్పటికే భాగ్యనగరంతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ లో అకస్మాత్తుగా వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డారు. మంగళ, బుధ వారాల్లో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు), 30 నుంచి 40 కి.మీ. వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.మొంథా తుఫాన్రణంగా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి.. రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి నష్టం మరోసారి జరగకుండా రైతులు ముందస్తుచర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పంట పొలాల వద్ద కల్లాల్లో ధాన్యం ఉంటే వాటిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప.. బయటకు, పొలాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు
.















