ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 7
రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు, కాబట్టి కొత్త పార్టీలకు మనుగడ కష్టమే..” అని రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత స్వయంగా వచ్చి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరడంతో ఆమోదించానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. అంతకు ముందు ఆమె స్వయంగా రాజీనామా లేఖ అందించకుండా వ్యక్తిగత కార్యదర్శి (పిఏ) ద్వారా పంపించినందున ఆమోదించలేదని ఆయన చెప్పారు. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అని భావించి కొంత సమయం ఇవ్వడం సర్వసాధారణంగా చేస్తుంటామని ఆయన తెలిపారు. చట్ట సభల్లో ఎక్కడైనా సభ్యుడు రాజీనామా చేసినప్పుడు ప్రసంగించేందుకు అనుమతించాలని కోరితే ఇవ్వడం సంప్రదాయంగా ఉందన్నారు. కవిత కోరిక మేరకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని ఆయన తెలిపారు. కవిత పార్టీ పెట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు కాబట్టి కొత్త పార్టీలకు మనుగడ కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఆ వెంటనే కొంత కాలానికి అవి కనుమరుగయ్యాయని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల గురించి ప్రశ్నించగా, సాధారణంగా అధికార పార్టీకే ఎక్కువగా గెలుపొందే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. కౌన్సిల్లో కవిత కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా, తాను స్పందించడం బాగుండదని, అవి ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలని అన్నారు.















