EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో ప్రభుత్వ సేవలు

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 3

తెలంగాణలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరిగే పని లేకుండా, కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో ప్రభుత్వ సేవలు పొందేలా ‘వాట్సాప్ చాట్‌బాట్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా 80969 58096 అనే నంబర్‌ను కేటాయించింది. దీనివల్ల సామాన్యులకు ప్రభుత్వ సేవలు పొందడం మరింత సులభం కానుంది.

ప్రజలు తమ మొబైల్‌లో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకుని ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు. వెంటనే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవల మెనూ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రస్తుతం మీ-సేవలో లభించే కులం, ఆదాయ ధ్రువపత్రాల దరఖాస్తు, దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, మున్సిపల్ పన్నుల చెల్లింపు వంటి సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఇప్పటికే ఇంటర్, పదో తరగతి హాల్ టికెట్లను ఈ విధానం ద్వారా విజయవంతంగా అందజేసిన ప్రభుత్వం, దీనిని పూర్తిస్థాయిలో ‘వన్ స్టాప్ షాప్’గా తీర్చిదిద్దింది.గతంలో వివిధ శాఖల కోసం వేర్వేరు వెబ్‌సైట్లు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాల వంటి కీలక శాఖల సమాచారం ఇప్పుడు ఒకే వేదికపై లభిస్తుంది. ఫిర్యాదుల నమోదు నుంచి సర్టిఫికెట్ల జారీ వరకు అన్నీ డిజిటలైజ్ చేయడం ద్వారా పాలనలో వేగం, పారదర్శకత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

రానున్న రోజుల్లో ఈ చాట్‌బాట్ సేవలను మరింత విస్తృతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక సందేశాలు, అలర్ట్‌లు కూడా ఇకపై ఇదే నంబర్ ద్వారా ప్రజలకు చేరనున్నాయి. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, అర్హతలు తెలుసుకోవడం, రేషన్ కార్డులు, పెన్షన్ల వివరాలు కూడా దీనికి అనుసంధానించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే నగదు వివరాలను కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top