ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 16
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భానుడి భగభగలకు తోడు వడగాల్పులు కూడా వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని సూచించారు.ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, మేడ్చల్ వంటి ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉంది. వేడి గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఎక్కువ మొత్తంలో నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో నీడ పట్టున ఉంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం.















