ఈతరం భారతం హైదరాబాద్ జులై 13;
కులాన్నే మాయం చేసే కుట్రలతో తీవ్ర ఆందోళనకు గురైన విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల ఇది నిజంగా శుభవార్తే! కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనలో విశ్వబ్రాహ్మణ కుల ప్రస్తావన లేకపోవడంతో… కార్యాచరణకు దిగిన విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడమే కాకుండా… స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఐదు వృత్తులను వేర్వేరు కులాలుగా గుర్తించారని, దీని వల్ల అన్ని విధాలా నష్టపోతున్నామని వివరించింది. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను సీఎం ఆదేశించారు.
ఈమేరకు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ను సోమవారం విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ బృందం మినిస్టర్స్ క్వార్టర్స్లో కలిసింది. విభజించబడిన 5 వృత్తులను తిరిగి ఒక్కటిగా గుర్తించాలని కోరింది. వెంటనే మంత్రి పొన్నం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు ఫోన్ చేసి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సమస్యను పరిష్కరాల్సిందిగా ఆదేశించారు. ఆ వెంటనే జేఏసీ బృందం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయానికి వెళ్లి, చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు తిరుమల సురేందర్, రాపోలు జయప్రకాశ్లను కలిసి… ఐదు వృత్తులను గతంలో లాగే విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. సమస్యను సావధానంగా విన్న చైర్మన్ నిరంజన్, వచ్చే వారం జరిగే బీసీ కమిషన్ సమావేశంలో ఈ మేరకు చర్చించి ఆమోదిస్తామని, ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ బృందంలో దేవరకొండ కాళిదాస్, భూంపల్లి రాజమౌళి చారి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి చైర్పర్సన్త తంగళ్లపల్లి రవికుమార్, విశ్వకర్మ ఫౌండేషన్ చైర్మన్ అఢ్లూరి రవీంద్రా చారి, వేదాస్ అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.















