EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సింగరేణి అధికారుల స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌ర‌మే సానుకూల నిర్ణయం తీసుకోండి : సింగ‌రేణియాజ‌మాన్యానికి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క

ఈతరం భారతం హైద్రాబాద్ జులై13:

సింగ‌రేణిలో విధులు నిర్వ‌హిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై వీలైనంత త్వ‌ర‌గా సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి యాజ‌మాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థ‌ల మాదిరిగా సింగ‌రేణి అధికారుల వేత‌న స‌వ‌ర‌ణ‌, ప‌ర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్‌ (PRP) అమ‌లుకు సంబంధించి అధికార సంఘం నాయ‌కులు చేసిన విజ్ఞ‌ప్తుల‌ను ప్రాధాన్యంగా ప‌రిగ‌ణించి త్వ‌రిత‌గ‌తిన‌ నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించారు.

ఇటీవ‌ల ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చొర‌వ‌తో తాడిచ‌ర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావ‌డంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క పోషించిన కీల‌క పాత్ర‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ సింగ‌రేణి అధికార సంఘం నాయ‌కులు ఆయ‌న‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు సంబంధించిన వివిధ స‌మ‌స్‌పల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేలా సింగ‌రేణి యాజ‌మాన్యానికి ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌నను కోరారు.

ఈ విజ్ఞ‌ప్తుల‌పై స్పందించిన ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క సోమ‌వారం ఉద‌యం సింగ‌రేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి, డైరెక్ట‌ర్‌ (ప‌ర్స‌న‌ల్‌ & ఫైనాన్స్‌) శ్రీ గౌత‌మ్ పోట్రుతో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌జా ప్ర‌భుత్వం సింగ‌రేణి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్య‌త‌ ఇస్తోంద‌ని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇంధ‌న భ‌ద్ర‌త‌ను అందించ‌డంలో సింగ‌రేణి కార్మికులు, అధికారులు విశేష కృషి చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అధికారుల్లో ఎలాంటి అసంతృప్తి నెల‌కొన‌కుండా వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని, అధికార సంఘం నాయ‌కుల‌తో చ‌ర్చించి వారికి భ‌రోసా క‌ల్పించాల‌ని యాజ‌మాన్యాన్ని ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా రానున్న రెండు నుంచి మూడు నెల‌ల్లో అధికారుల విజ్ఞ‌ప్తుల‌పై సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

అదేవిధంగా, మారుతున్న ప్ర‌పంచీక‌ర‌ణ ప‌రిస్థితులు, పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్ప‌త్తి, విక్ర‌యాల్లో సింగ‌రేణి పోటీతత్వాన్ని మ‌రింత పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సింగ‌రేణిని బ‌హుముఖ రంగాల్లో విస్త‌రించి అంత‌ర్జాతీయ స్థాయి సంస్థ‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కీల‌క పాత్ర పోషించాల‌ని, ఈ దిశ‌గా అధికార సంఘం నాయ‌కులు కూడా అధికారుల్లో సానుకూల దృక్ప‌థం, కార్యోన్ముఖ‌త పెంపొందించేలా కృషి చేయాల‌ని ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు.

ఉప ముఖ్య‌మంత్రికి సింగరేణి అధికార సంఘం నాయ‌కుల కృత‌జ్ఞ‌త‌లు

సింగ‌రేణి సుస్థిర భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధ‌న‌కు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌కు సింగ‌రేణి అధికార సంఘం అధ్య‌క్షుడు తాళ్ల‌ప‌ల్లి ల‌క్ష్మీప‌తి గౌడ్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ పెద్ది న‌ర‌సింహులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇటీవ‌లే రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించామ‌ని, దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందించి స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని యాజ‌మాన్యానికి ఆదేశాలు జారీ చేయ‌డంపై వారు ఉప ముఖ్య‌మంత్రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సింగ‌రేణి అభివృద్ధి, విస్త‌ర‌ణ‌, సుస్థిర భ‌విష్య‌త్ కోసం చేప‌డుతున్న‌ ప్ర‌తి కార్య‌క్ర‌మానికి అధికారుల త‌ర‌ఫున సంపూర్ణ మ‌ద్ద‌తు అందిస్తూ, సంస్థ పురోగ‌తి కోసం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తామ‌ని వారు స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top