ఈతరం భారతం హైదరాబాద్, జూలై 25:
విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఐటీ ప్రొఫెషనల్ ఫ్రెండ్లీ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని వాసవి క్లబ్ లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ రంగానికి చెందిన విశ్వకర్మ ప్రముఖులు హాజరయ్యారు. విశ్వకర్మలు ఏకీకృతం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అని కొనియాడారు.
విశ్వకర్మలు అయిదు వృత్తులలోనే కాకుండా, అన్ని రంగాలలోనూ అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని వక్తలు అన్నారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీలలో విశ్వబ్రాహ్మణులు సత్తా కనబరుస్తున్నారని, డల్లాస్ నుండి వచ్చిన గ్లోబల్ విశ్వకర్మ సంస్థ ప్రతినిధి చైతన్య తెలిపారు. విశ్వకర్మ జాతికి చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులై సమాజానికి ఉపయోగపడే స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకెళ్లాలని ఇతర వక్తలు సూచించారు. విశ్వకర్మ కులానికి చెందినవారందరిని ఒక వేదిక పైకి తీసుకుని వచ్చి జేఏసీ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి జనాభా లెక్కలు తేల్చాలని అందరూ అభిప్రాయపడ్డారు. విశ్వకర్మ ఐదు కులాలకు చెందిన వారిని ప్రభుత్వం గుర్తించి అన్ని కులాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మున్ముందు అన్ని రంగాల్లో ఉన్న విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారందరితో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కన్వీనర్ దేవరకొండ కాళిదాస్, కోకన్వీనర్ అడ్లూరి రవీంద్ర చారి తెలిపారు. ఈ సమావేశంలో విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ కన్వీనర్, కో-కన్వీనర్ అడ్లూరి రవీంద్ర చారి, విశ్వవిశ్వాని యూనివర్శిటీ వ్యవస్థాపకులు తాడూరి శ్రీనివాస చారి, హెచ్ఎస్బీసీ డైరక్టర్ , గ్లోబల్ విశ్వకర్మ ఎన్ఆర్ఐ సంఘం ప్రతినిధి చైతన్య, ప్రవాస భారతీయుడు మారోజు వెంకట్, సాఫ్ట్వేర్ రంగం ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు.














