ఈతరం భారతం న్యూఢిల్లీ జూలై 25
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేయడంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి ఈ అదనపు బాధ్యతలు కేటాయించారు. మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.మరోవైపు, ధర్మేంద్ర రాజీనామాపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నైతిక బాధ్యతతో ధర్మేంద్ర తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి అత్యున్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన అపారమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడంలో, విద్యావ్యవస్థలో అనేక మార్పులు ప్రవేశపెట్టడంలో ఆయన నాయకత్వం దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని ప్రశంసించారు. తాను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో అక్కడి ప్రభుత్వ పాఠశాలలను CBSE విధానంలోకి తీసుకురావడానికి ప్రధాన్ పూర్తి స్థాయిలో సహకరించారని గుర్తుచేసుకున్నారు. దీనివల్ల ఎంతోమంది పేద, వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.















