ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 2 :
రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8వెలకోట్లు వెంటనే విడుదల చేయాలని, ఈ స్కీము ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని, ఈ స్కీమును యధాతధంగా పాత పద్ధతిలోనే అమలు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈ స్కీముకు బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటుంటే కూడా ఓర్వలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు. పేద కులాలు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర కాకుండా 23 వేల ప్రభుత్వ పాఠశాలను రద్దు చే స్తామని బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఎంతో ఉన్నత విద్య ప్రమాణాలతో బలహీన వర్గాల జీవితాల మార్పు, అభివృద్ధి చేస్తున్న గురుకులాలను రద్దు చేసే కుట్రకు తెర తీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా ప్రజా వ్యతిరేక బీసీ/ఎస్సీ/ఎస్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారో ఎవరికి అంతుచిక్కడం లేదు. గతంలోని ముఖ్యమంత్రులంతా విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గొడ్డలితో నరికే తిరోగమన చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో సి.రాజేందర్, నీల వెంకటేష్.ఆనంతయ్య,నిఖిల్ పటేల్,పి.సతీష్.రందేవ్.తదితరులు పాల్గొన్నారు.















