ఈతరం భారతం పీపల్ పహాడ్ ఆగస్టు 19 బుధవారం
అతి ప్రాచీన చరిత్ర కలిగిన పీపల్ పహాడ్ గ్రామంలో జన గ్రంథాలయం ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని పీపల్ పహాడ్ గ్రామంలో ఈ గ్రంథాలయాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి నాగేశ్వరి అశ్విన్ లు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన శ్రీమతి దాసరి మంగళ, శ్రీమతి నాగేశ్వరి, శ్రీమతి శోభ లు చేసారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ ఉద్యమకారులు, విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
గౌరవ అతిథిగా సీనియర్ పాత్రికేయులు నేలoటి మధు, ఆత్మీయ అతిథులుగా విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారులు ఆందోజు నాగభూషణం, పీపల్ పహాడ్ జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు శోభ లు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కవి రచయిత లెక్కల మల్లారెడ్డి రాసిన సాయుధ పోరాటం 1948 పుస్తకాన్ని జెడ్ పి హెచ్ స్ ప్రధానోపాధ్యాయురాలు శోభ ఆవిష్కరించారు. అలాగే నేలoటి మధు రచించిన రాజకీయ వృత్తి పుస్తక పునర్ ముద్రణ కాపీలను సర్పంచ్ శ్రీమతి నాగేశ్వరి అశ్విన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమ ప్రాధాన్యతను తెలియజేశారు. పుస్తక పఠనం ఎంత ముఖ్యమో సోదాహరణంగా వివరించారు. సోషల్ మీడియా ప్రభావాన్ని తెలియచెప్పారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సందర్శించాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ అలవాటు నేర్పించాలని అన్నారు.
నేలంటి మధు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఆన్లైన్లో పుస్తకాలు చదివినా అవి తాత్కాలికంగా సహాయపడతాయే గానీ విషయం పూర్తి గా అర్థం చేసుకోవడానికి పుస్తకాలు మాత్రమే ఆధారం అని చెప్పారు
ఆందోజు నాగభూషణం మాట్లాడుతూ పీపల్ పహాడ్ గ్రామానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ ఊరికి తనకు చాలా కాలంగా అనుబంధం ఉందని చెప్పారు. ఈ గ్రామంలో జన గ్రంథాలయం ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని చెప్పారు
శ్రీమతి నాగేశ్వరి అశ్విన్ లు మాట్లాడుతూ తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రంథాలయంలో పుస్తకాల కోసం తాము కనబరిచిన ఆసక్తిని తెలియజేశారు. పుస్తకాలపై తమకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. పీపల్ పహాడ్ జన గ్రంథాలయం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సాయి సేవా ధర్మ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి భోగా నాగభూషణం అధ్యక్షత వహించారు. కార్యక్రమం అనంతరం సాయి సేవా ధర్మ ట్రస్ట్ అధ్యక్షులు ఊడుగు రాములు వందన సమర్పణ చేశారు
ఈ కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేసిన శ్రీమతి దాసరి మంగళ తో పాటు గ్రామ పంచాయతీ తరపున దానయ్య, పాలకవర్గ సభ్యులు ఎర్ర మహేష్, గట్టు మల్లేశ్, మరియు ఊరి ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.















