ఈతరం భారతం తిరుపతి జూలై 12 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఇన్చార్జి కమిషనర్ శారదాదేవి, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి తదితర అధికారులతో కలిసి ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. సమీక్ష అనంతరం ఎన్నికల కమిషన్ బృందం సెక్షన్ ఆఫీసర్ అనిత కుక్రేజా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉదిత్ కుమార్లతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తిరుపతిలోని రామకృష్ణ థియేటర్ సర్కిల్, లక్ష్మీపురం, వైకుంఠపురం ప్రాంతాలతో పాటు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు, చిన్నగొట్టిగల మండలం భాకరాపేట, ఎర్రావారిపాలెం మండలం నెరబైలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు, బీఎల్ఓలను కలిసి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ హెల్ప్డెస్క్ పనితీరును పరిశీలించి సచివాలయ సిబ్బంది, బీఎల్ఏలతో మాట్లాడారు. తిరుచానూరు ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పలువురు తిరిగి వెళ్లిపోవడంతో 2002 ఓటర్ల జాబితాతో పోల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని బీఎల్ఏలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వైకుంఠపురంలోని 250వ పోలింగ్ కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వేలో పాల్గొని స్థానిక ఓటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్బాబు, తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్రాజు, సచివాలయ సిబ్బంది, బీఎల్ఓలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.















