ఈతరం భారతం తిరుపతిసెప్టెంబరు 03 గురువారం రిపోర్టర్ మనోజ్ కుమార్ :
____________________________________________________________
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు.అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏసీబీ సోదాల్లో లోకనాథంకు సంబంధించి సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. మొత్తం 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండితో పాటు రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం, ఆయన కుమారుడి పేరిట ఉన్న 4 ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా గుర్తించారు. తిరుపతిలోని శ్రీనివాసనగర్లో ఒక ఫ్లాట్, గొల్లవానిగుంట ప్రాంతంలో రెండు ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడు గ్రామంలో మరో ఇల్లు కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో స్పష్టమైంది.టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో…
టీటీడీలో చోటుచేసుకున్న కల్తీ నెయ్యి వ్యవహారంలో గతంలో నమోదైన కేసు ఆధారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్నను గతంలో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ విచారణ సందర్భంగా వెల్లడైన పలు కీలక అంశాలు, సేకరించిన ప్రాథమిక ఆధారాల ఆధారంగానే డిప్యూటీ ఈవో లోకనాథంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, ఈ దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు















