ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 18
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీను ఇడి కేసులతో వేధిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎఐసిసి పిలుపు మేరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్ నుంచి బిజెపి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. బిజెపి కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయుకులు ధర్నా తల పెట్టారు. వివిధ జిల్లాల నుంచి గాంధీభవన్ కు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నిరసన పాల్గొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గాంధీభవన్ గేట్లు పోలీసులు మూసేయడంతో గాంధీభవన్ గేట్లు దాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు.కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యా రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. గాంధీ భవన్ నుంచి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన సమయంలో, పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సంధ్యా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి, సంధ్యా రెడ్డికి దగ్గరుండి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.















