ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 14:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ నడుమ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఒకరైన మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఈ ఘటనతో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాల్లోకి వెళితే, ఎర్రగడ్డలో నివాసముంటున్న అన్వర్ ఉదయం నుంచి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఒత్తిడి, ఆందోళనే ఆయన మరణానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అన్వర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజకీయ వర్గాలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.ఈ విషాద ఘటన ఓ వైపు ఆవేదన కలిగిస్తుండగా, మరోవైపు యూసఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.















