ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 3
రాష్ట్రంలోని సినిమా థియేటర్ల రెంటల్ పద్దతిపై ఏర్పడిన వివాదానికి పుల్స్టాప్ పడింది. ప్రధానంగా సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య దశాబ్దాలుగా రెంటల్ వివాదం నడుస్తోంది. ఈ రెంటల్ విషయంలో ఇరు వర్గాల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ లోని థియేటర్ల యాజమాన్యాలు ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇకపై థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించే రెంటల్ విధానానికి బదులుగా దాని స్థానంలో పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించాయి.ఈ కొత్త విధానం ప్రకారం థియేటర్లకు వచ్చే వసూళ్లలో వాటాను పంచుకునే పద్దతి అందుబాటులోకిరానుంది. ఈ కొత్త విధానానికి సంబంధించి రాష్ట్రంలోని 23 ప్రధాన థియేటర్ల యాజమాన్యాలు తమ అంగీకారం తెలిపాయి. ఈ మార్పు ఈ నెల 3వ తేదీ నుండి అధికారికంగా అమలులోకి రానుంది. దీంతో చిత్ర పరిశ్రమలో పంపిణీదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రెంటల్ విధానం ప్రకారం సినిమా రిజల్ట్ (కలెక్షన్లు) సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకు భారీగా అద్దెలు చెల్లించాల్సి వచ్చేది. సినిమా ఫ్లాప్ అయితే పంపిణీదారులు భారీగా నష్టాల పాలై నిలువునా మునిగిపోయేవారు. కానీ, తాజా పర్సంటేజీ విధానంలో థియేటర్ వసూళ్లలో కొంత శాతం యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకు దక్కుతుంది.















