ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 3 :
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘నర దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా దాడికి దిగారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చాడు. ‘నర దిష్టి’ అంశంలో పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా చేసిన ‘నర దిష్టి’ వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్తే, తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నాను, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం అంటూ కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.కాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గోదావరి జిల్లాల పర్యటనలో మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది అని, తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా తాజాగా కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు
.















