ఈతరం భారతం హైదరాబాద్, డిసెంబర్ 30
సాహిత్యమే ప్రజలని బతికిస్తుందని, బతుకునిస్తుందని ప్రముఖ ప్రజా వాగ్గేయకారులు జయరాజు అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా, తెలుగుశాఖ నిర్వహించిన “తెలంగాణ పద సాహిత్యం – సమాలోచన” అనే జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి, ప్రకృతికి ఆత్మీయ సంబంధం ఉందని అన్నారు. ఈ సదస్సు డైరెక్టర్ గా వ్యవహరించిన తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఆ పరంపర కొనసాగిందని, దీన్ని ముందు తరాలకు అందించడం నేడు మనపై ఉన్న వర్తమాన బాధ్యత అని అన్నారు. ప్రత్యేక అతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పద సాహిత్యం సమాలోచన సదస్సు ఏర్పాటు చేసినందుకు తెలుగు శాఖను అభినందించారు. తెలంగాణ నేలంతా ప్రజల నోళ్ళల్లో పద సాహిత్యం విరాజిల్లుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధిగా విచ్చేసిన ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ యూనివర్సిటీల్లో పద సాహిత్యం పై విస్తృతమైన పరిశోధనలు రావాలని సూచించారు. ఆత్మీయత అతిథి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. చింతకింది కాశీం మాట్లాడుతూ సారవంతమైన పరిశోధనలు రావాలంటే సామాజిక సంఘర్షణాత్మక జీవితాన్ని సాహిత్యానికి అనుసంధానించాలని అన్నారు. తెలుగు పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులు డా. ఏలే విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఈ సదస్సును ఆదర్శంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లోని పద సాహిత్యాన్ని వెలికి తీయాలని సూచించారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన సదస్సు నివేదికను తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎస్. రఘు ప్రవేశ పెట్టారు. ఈ సదస్సులో 32 పైగా ప్రసంగ పత్రాలు, 300 వరకు ప్రతినిధులు పాల్గొన్నారని, సభ విజయవంతంగా తెలంగాణ పద సాహిత్యంపై లోతైన చర్చ, పరిశోధనను ఈ సభ హామీ పడిందని అన్నారు. ఈ సదస్సులో తెలుగుశాఖ అధ్యాపకులు, ఇతర శాఖల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.















