ఈతరం భారతం భాగ్యనగరం ఏప్రిల్ 5
భాగ్యనగర ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ భారీ శుభవార్త వినిపించింది. ప్రస్తుతం నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు గాజులరామారంలో అత్యంత ఆధునిక వసతులతో కూడిన నూతన బస్ టెర్మినల్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాదాపు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ టెర్మినల్, ఉత్తర హైదరాబాద్ ప్రాంత ప్రయాణికులకు వరంగా మారనుంది. దీని ద్వారా ఎంజీబీఎస్ మరియు జేబీఎస్లకు అంతరాష్ట్ర బస్సుల తాకిడి తగ్గి, నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇప్పటికే 100 ఎకరాల భూమిని టీజీఎస్ఆర్టీసీకి కేటాయించారు.ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే బస్సులు కూకట్పల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్ వంటి ప్రధాన రహదారులపై నిలపడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే, ఈ బస్సులన్నింటినీ గాజులరామారానికి మళ్లిస్తారు. అంతేకాకుండా, వాహనదారుల సౌకర్యార్థం అండర్గ్రౌండ్లో మల్టీలెవల్ పార్కింగ్ యార్డ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో 10 కొత్త బస్ డిపోలను నిర్మించేందుకు కూడా ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.















