ఈతరం భారతం ఖమ్మం, ఆగస్టు -26: గర్బస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి అన్నారు.కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో మంగళవారం గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి మాట్లాడుతూ* ఖమ్మం జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలలో జరిగే ప్రతి స్కానింగ్ కు సంబంధించి ఫారం ఎఫ్ రూపొందించి ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగే ప్రసవాలలో వెయ్యి మంది మగ పిల్లలకు 988 మంది ఆడ పిల్లలు జన్మిస్తున్నారని, గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పది వేలు జరిమాన విధించబడుతుందని,అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లింగ నిర్ధారణ అరికట్టుటకు ప్రతి నెల స్కానింగ్ సెంటర్లను కార్యాలయ సిబ్బంది, బృందంతో తనిఖీ నిర్వస్తున్నామని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులలో జరుగుతున్న అబార్షన్ కేసులను సైతం స్టడీ చేసి ఎక్కడైనా లింగ నిర్ధారణ కారణంగా అబార్షన్ జరిగిందా అని పరిశీలించాలని డిఎంహెచ్ఓ తెలిపారు. అధికంగా అబార్షన్ జరిగే ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు లింగ నిర్ధారణ చేయకుండా ఉండే విధంగా చట్టం పై పూర్తి అవగాహన కల్పించాలని, లింగ నిష్పత్తి సమానమయ్యే దిశగా కృషి చేయాలని, ఏ స్కానింగ్ కేంద్రంలో అధికంగా స్కానింగ్ లు అవుతున్నాయో పరిశీలించి ఆకస్మిక తనిఖీలు చేయాలని అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ద్వారా ప్రజల్లో ఆడపిల్ల అదృష్టమనే అవగాహనతో పాటు ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. పోస్టర్లు, కరపత్రాల ద్వారా చట్టం పై అవగాహన, ఆడపిల్లలు మగపిల్లలతో సమానమేనని, అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తారనే విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. గర్భిణీ లపై అంగన్వాడీ, ఆశా లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా 5, 6 వ నెలల్లో అబార్షన్ లకు అవకాశం ఉంటుందని, వీరు పరీక్షలకు వచ్చేలా ఫాలో అప్ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, పీవో ఎంసిహెచ్ డా. చందు నాయక్, పీవో ఎన్సివి డా. పి. వెంకట రమణ, ఏడి కె. శ్రీనివాసరావు, డిఎంసి ఎస్డీ. సమ్రీన్, జాగృతి ఎన్జిఓ ఎం. కుముదిని, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.















