ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 18:
_________________________________
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిస్తూ ఆయనపై అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి హైకోర్టు తెలిపింది.
ఇదీ కేసు నేపథ్యం
దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిలు వేర్వేరుగా పిటిషన్లను దాఖల చేసిన విషయం తెలిసిందే. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున శాసనసభ్యుడిగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున పోటీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. 10వ షెడ్యూల్ ప్రకారం వ్యవహరించకుండా, రూల్స్కు విరుద్ధంగా నడుచుకున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని వారు హైకోర్టును కోరారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన శాసనసభాపతికి పలు ఆధారాలు సమర్పించామని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11వ తేదీన ఉత్వర్వులిచ్చిందని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల కమిషన్కు సమాచారం ఇచ్చింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే యోచనలో దానం
దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పుపై ఆయన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ దానంతో సమావేశమయ్యారు.















