ఈతరం భారతం ఖమ్మం జూలై 17 :అక్క ఎలా ఉన్నావు అంటూ మహిళ పారిశుద్ధ్య కార్మికులను మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో గురువారం రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. రింగ్ రోడ్డు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్, బస్టాండ్ శ్రీ శ్రీ కళ్యాణ మండపం వరకు నడుస్తూ, ప్రజలను పలకరిస్తూ మున్సిపాలిటీలో సమస్యల పై ఆరా తీశారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో జాప్యం పై ఆర్ అండ్ బి శాఖ అధికారులను వివరణ కోరారు. అనంతరం దొంతికుంట చెరువును పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడితూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల ఆకాంక్ష మేరకు తెలంగాణ సరిహద్దుల్లోని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావుపేటను మెరుగైన మౌలిక వసతులతో పాటు సుందరీకరించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దొంతికుంట చెరువుకు డ్రైనేజీల ద్వారా వచ్చే నీరుని శుద్ధి చేసే విధంగా ప్రణాళికలు ఉన్నాయన్నారు. దొంతికుంట చెరువు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటుచేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులకు అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పొంగులేటి వెంట కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబు, చిన్నశెట్టి యుగేందర్, జూపల్లి ప్రమోద్, తుమ్మ రాంబాబు, అల్లాడి వెంకట రామారావు తదితరులు ఉన్నారు.















