యాదగిరిగుట్ట, జూలై 24 (ఈతరం భారతం): మంగళ వాయిద్యాలు మోగుతుండగా… మంత్రోచ్ఛరణలు జరుగుతుండగా… భక్తజనులు జేజేలు పలుకుతుండగా… అత్యంత శాస్త్రోక్తంగా గుళిక కాలంలో శ్రీ మాందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది .దీంతో యాదగిరిగుట్ట పట్టణానికి సమీపంలో మల్లాపురం మార్గంలో సైదాపురం గ్రామ పరిధిలోని శ్రీ బోధానంద గిరి స్వామి గోసేవ ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలో తొలి శ్రీ మాందేశ్వర స్వామి ఆలయం కలిగిన ఆశ్రమంగా ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోనుంది .ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ బోదానందగిరి స్వామి నేతృత్వంలో కన్నుల పండుగ గా కొనసాగిన ఈ విగ్రహ ప్రతిష్టాపనలో వేలాదిమంది అభిమానులు, భక్తులు , అనేక మంది ప్రజాప్రతినిధుల తోపాటు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా పాల్గొని పూజలుచేశారు. గ్రహ దోషాలు, అనారోగ్యాలు, కష్టాలు నష్టాలు, ప్రమాదాలు ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారు శ్రీ మాందేశ్వర స్వామి వారిని కొలిస్తే చాలు అన్ని అడ్డంకులు తొలగుతాయని… సుఖశాంతులు.. అష్ట ఐశ్వర్యాలు …సంపూర్ణ ఆరోగ్యం వంటివి కలుగుతాయని ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ బోధానందగిరి స్వామి భక్తులకు సెలవిచ్చారు. శ్రీ శనీశ్వరుని కుమారుడే శ్రీ మాందేశ్వర స్వామి అని… ఈశ్వర శబ్దంతో వచ్చే దశమ శక్తి స్వరూపమే శ్రీ స్వామివారు అని అన్నారు. దర్శనం తో పాటు అభిషేకాలు, అర్చనలు ,హోమాల వంటివి చేస్తే చాలు అత్యంత శక్తివంతుడైన శ్రీ మాంగేశ్వర స్వామి అనుగ్రహిస్తాడని స్వామీజీ వివరించారు. భక్తుల దాతల సహాయ సహకారాలతో లింగ రూప ప్రతిష్టాపనతో దర్శనమిస్తున్న శ్రీ మాందేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ కాలభైరవ శక్తిపీఠం ఆలయం కూడా ఉండడంతో సకల దోష నివారణకు ఆలయ సందర్శన తోడ్పడ నుంది .విగ్రహ ప్రతిష్టాపనలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న పలువురు భక్తులు మాట్లాడుతూ… ఇప్పటివరకు శ్రీ శనీశ్వరుని కుమారుడైన శ్రీ మాందేశ్వర స్వామి దర్శనంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి వచ్చేది, ఇక వ్యయప్రాయాసలకు లోను కావలసిన పనిలేదు ,రాష్ట్ర రాజధానికి అతి చేరువలోనే ప్రశాంత వాతావరణంలో శ్రీ భోధానందగిరి స్వామి గో సేవ ఆశ్రమంలో కొలువైన శ్రీ మాందేశ్వర స్వామి ఆలయం సకల జనులకు అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. విచ్చేసిన వందలాదిమంది భక్తులకు తేనీరు, అల్పాహారం , భోజనాలు ఏర్పాటు చేసిన ఆశ్రమ నిర్వాహకులను భక్తులు అభినందనలతో ముంచెత్తారు.















