ఈతరం భారతం హైదరాబాద్ జూలై 28 :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలవనున్నారు.అంతేగాకుండా.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి మద్దతు కూడా కోరనున్నారు. మరోవైపు కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకున్నారు.















