ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 11 :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, పార్టీ వ్యవస్థాపక కార్యకర్త నాగమణి ఆకస్మిక మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడం తో పాటు, మహిళా కార్యకర్తలకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తిగా నాగమణి గుర్తుండిపోతారని ఆయన పేర్కొన్నారు. ఆమె పార్టీ పట్ల చూపిన నిబద్ధత, సేవా భావం మరువలేనిదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి కృషి చేసిన స్ఫూర్తిదాయక నాయకురాలిగా ఆమె నిలిచారని గుర్తు చేశారు. ఆమె మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.















