ఈతరం భారతం ఖమ్మం, ఆగస్టు-11:చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులి పురుగులను అల్బెండజోల్ మాత్రల ద్వారా పూర్తిస్థాయిలో నిర్మూలిస్తే పిల్లలకు రక్షణతో ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఎన్ఎస్పీ క్యాంప్ రోడ్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్యా, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని విద్యార్ధులకు అల్బెండజోల్ మాత్రలను స్వయంగా అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న 3,11,317 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నులిపురుగుల నివారణ పంపిణీ కోసం జిల్లాలో మొత్తం 3458 విద్యాసంస్ధలలో ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల బారి నుండి రక్షణ పొంది, ఎనిమియా తదితర జబ్బులు రాకుండా మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ది సాధించాలని అన్నారు. వ్యక్తిగత పారిశుద్ధ్యం పట్ల జాగ్రత్త వహించాలని, అంటు వ్యాధులను నివారిస్తూ ఆర్యోగంగా ఉండాలని సూచించారు.
జిల్లాలోని అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో, ప్రభుత్వ , ప్రభుత్వేతర పాఠశాలలో, జూనియర్ కళాశాలలో, సాంకేతిక కళాశాలలో మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నేడు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోని విద్యార్థులకు ఆగస్టు 18న మరోమారు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.విద్యార్థులు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్న వయసు నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్యవంతమైన నడవడికతో మంచిగా చదువుకోవాలని తెలిపారు. నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరు సద్వినియోగం చేసుకోవాలని , తప్పనిసరిగా 19 సంవత్సరాలలోపు వయస్సు కల్గిన ప్రతి ఒక్కరు నివారణ మందులు వేసుకోవాలని అన్నారు.
జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, పెద్ద వాళ్ల కంటే పిల్లల ఆరోగ్యంపై నులి పురుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పిల్లలకు అందే పోషకాలను ఇవి తీసుకోవడం ద్వారా వారిలో ఎదుగుదల లోపం కనిపించడంతో పాటు ఇతర సమస్యలకు కారణమవుతాయని అన్నారు. పిల్లల్లో నులి పురుగులు ఉంటే ఆరోగ్య సమస్యలతో పాటు ఎదుగుదల లోపిస్తుందని, రక్తహీనత, పోషకాల లోపంతో చిన్నారులకు పౌష్టికాహారం అందించినా ఉపయోగం ఉండదని, 1నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్ర చొప్పున వేసుకొని పూర్తిగా నమలమని కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. కళావతిబాయి, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, అధికారులు తదితరులు ఉన్నారు.















