ఈతరం భారతం హైద్రాబాద్ ఫిబ్రవరి 6
బాబా శ్యామ్ కు అత్యంత ఇష్టమైన ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 8,2026 న వేలాదిమంది భక్తులతో శ్రీ బాబా శ్యామ్ భారీ రథ్ యాత్రను నిర్వహిస్తున్నట్లు బాబా శ్యామ్ రథశోభ యాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్ అగర్వాల్, వైస్ చైర్మన్లు రామ్దేవ్ అగర్వాల్, పురుషోత్తం దాస్ గోయల్ లు తెలిపారు. హైదరాబాద్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిటీ సలహాదారు చంద్రకాంత్ డకోటియా. కన్వీనర్లు అమిత్ అగర్వాల్, రాంనిరంజన్ అగర్వాల్, సంతోష్ అగర్వాల్, నర్సింగ్ జైస్వాల్, జీవన్ భాటి, అభిషేక్ శర్మ, సుశీల్ అగర్వాల్ మరియు గోవింద్ పొద్దార్, శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి అధ్యక్షులు చంద్రకాంత్ డకోటియా, ఉపాధ్యక్షులు కృష్ణ కుమార్ బడేగావ్వాలే, కార్యదర్శి ఇంద్రకరణ్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శులు రామ్దేవ్ అగర్వాల్, రాజ్కుమార్ విగ్, కోశాధికారి కపిల్ అగర్వాల్ లతో కలసి వారు మాట్లాడుతూ మహాభారతంలోని పాండవులలో ఒకరైన భీముని మనవడైన బర్బరీకుడికి అంకితం చేయబడిన ఖాటు శ్యామ్ జీ ఆలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, సికర్ జిల్లా, ఖాటు గ్రామంలో ఉందని, దక్షిణ భారతదేశంలో మొదటి ఖాటు శ్యామ్ జీ ఆలయం హైదరాబాద్లోని కాచిగూడ, వీరన్న గుట్ట పై ప్రసిద్ధి చెందిందని, ఈ ఆలయాన్ని శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి నిర్వహిస్తుందని, ఇక్కడ నిత్యం పూజలు, అభిషేకం, భక్తులకు శ్యామ్ జల్ (పవిత్ర జలం), ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని, శ్రీ శ్యామ్ సంకీర్తన, దీనితోపాటు ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల అన్ని రకాల కోరికలను తీరుస్తున్న బాబా శ్యామ్ కు అత్యంత ఇష్టమైన ఫాల్గుణ మాసంలో శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాబా శ్యామ్ రథ్ శోభ యాత్ర, మరియు జెండాల ఊరేగింపు ను ఫిబ్రవరి 8, 2026న ఉదయం చార్మినార్, మహాదేవ్ ఆలయం నుండి ప్రారంభమై, ఆఫ్జాల్ గూంజ్, గౌలిగూడ, చాదర్ ఘాట్, నింబోలి అడ్డా మీదుగా కాచిగూడ లోని వీరన్న గుట్ట శ్రీ శ్యామ్ మందిర్ కు చేరుకుంటుందని, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయని చెప్పారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న జెండా (నిషాన్) లతో పాల్గొని రథయాత్ర అనంతరం ఆలయంలో జెండాలను సమర్పిస్తారని అన్నారు. ఈ రథయాత్రలో భక్తులు జండాలు చేతబూని సంగీత వాయిద్యాలతో వచ్చి, భజనలు, కీర్తనలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బాబాను ప్రసన్నం చేసుకుని, ఆలయంలో జెండాలను సమర్పిస్తారని, జెండాలు తీసుకువచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ భోజన ఏర్పాట్లను చేసిందని తెలిపారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ రథయాత్రను కనులారా వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా శ్యామ్ ను ప్రసన్నం చేసుకోవాలని వారు కోరారు.















