ఈతరం భారతం సంగారెడ్డి 11
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.34వ వార్డులో రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు (Addy) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రిగ్గింగ్ను అరికట్టాల్సిన సీఐ శివకుమార్, ఫిర్యాదు చేసిన అభ్యర్థిపైనే దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. సీఐ తన చొక్కా కాలర్ పట్టుకుని, బూతులు తిడుతూ బయటకు గెంటేశారని, అంతేకాకుండా జగ్గారెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యర్థి తన నాయకత్వానికి సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి తన అనుచరులతో కలిసి వెంటనే పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. “మా పార్టీ అభ్యర్థి కాలర్ పట్టుకోవడానికి సీఐకి ఎంత ధైర్యం?” అంటూ డీఎస్పీ సత్తయ్య గౌడ్తో వాగ్వివాదానికి దిగారు. బాధ్యుడైన సీఐని తక్షణమే అక్కడికి పిలిపించాలని డిమాండ్ చేస్తూ, పోలింగ్ నిలిపివేస్తామని హెచ్చరించడంతో వాతావరణం వేడెక్కింది.ఆందోళనకారులు పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. పోలీసులు, జగ్గారెడ్డి అనుచరుల మధ్య నెట్టులాట జరగడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.పరిస్థితి తీవ్రతను గమనించిన సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జగ్గారెడ్డితో చర్చలు జరిపి, జరిగిన ఉదంతంపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీ హామీతో జగ్గారెడ్డి శాంతించడంతో గంటల తరబడి కొనసాగిన హైడ్రామా సద్దుమణిగింది.















