ఈతరం భారతం హైద్రాబాద్ ఫిబ్రవరి 12
సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేశారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.సింగరేణి టెండర్ల నిబంధనల్లో అసలు మార్పులు ఎప్పుడు జరిగాయో సీఎం రేవంత్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల్లో మార్పులు చేసిందని, టెండర్ వేసే సంస్థలు ‘సైట్ విజిట్ పర్మిషన్’ తీసుకోవాలనే నిబంధనను అప్పుడే చేర్చారని ఆయన వెల్లడించారు. ఈ నిబంధన కొత్తగా తాము తెచ్చింది కాదని, దీనిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ ఇది 2018లో కేంద్రం చేసిన మార్పు అని నిరూపిస్తే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని ముఖ్యమంత్రి సూటిగా సవాల్ విసిరారు. కోల్ ఇండియా వంటి భారీ సంస్థల్లో కూడా ఇవే నిబంధనలు అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.సింగరేణి సంస్థ నష్టాల్లో ఉండటానికి గల కారణాలను వివరిస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం ఎండగట్టారు. సింగరేణి బొగ్గును రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ కు సరఫరా చేసిందని, అయితే అందుకు రావాల్సిన వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని ఆయన ఆరోపించారు. సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది గత పాలకులేనని, ఇప్పుడు తనను విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. “నేను అమాయకుడిని కాబట్టి నాపై నిందలు వేస్తున్నారు.. అసలు బాధ్యుడైన కేసీఆర్ను ఎందుకు ప్రశ్నించడం లేదు?” అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.సింగరేణి టెండర్లలో అవకతవకలు జరిగాయని, ముఖ్యమంత్రి బంధువులకు మేలు చేసేలా నిబంధనలు మార్చారని బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కిషన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించగా, రేవంత్ రెడ్డి మాత్రం అంతా పారదర్శకంగానే జరుగుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి గైడ్లైన్స్ సహా అన్ని అంశాలపై పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారసత్వ ఉద్యోగాలు మరియు మెడికల్ బోర్డు వంటి సౌకర్యాలను రద్దు చేసే ఆలోచనే లేదని ఆయన భరోసా ఇచ్చారు.















